Tuesday, September 9, 2008

పోస్టు చేయని ఉత్తరం





జోరున వర్షం కురుస్తోంది, అమ్మతో కలిసి ఎంతో ఆనందంగా ఇంట్లో ఆడుకుంటున్నాడు రవి.

కాసేపటికి వర్షం తగ్గటంతో ఇంటి ముందు ఉన్న నీళ్ళలో పడవలతో ఆడుకోసాగాడు.


" రవీ నీళ్ళలో తడవకూ, లోపలికు రా ",అని రవి అమ్మ అరిచింది .

" ఈ ఒక్క రోజేకదా అమ్మా, నువ్వుకూడా రా ఆడుకుందాము",అని రవి అడిగాడు.

అమ్మతో కలిసి హాయిగా ఆడుకుంటున్నాడు

'అమ్మా ఇంకో పడవ చేసీవా' అని రవి అడిగాడు

రవి అమ్మ రవికి రెండు పడవలు చేసిచ్చింది


ఇంతలో ' రవి నుంచో ', అని ఎవరో అరిచినట్లు వినిపించింది

రవి ఉలిక్కిపడి లేచాడు, ఎదురుగా తెలుగు మాస్టారు,

'ఇప్పుడు ఏమి చెప్పానో చెప్పు ', అని మాస్టారు అడగగానే తలదించుకొని నిలబడ్డాడు రవి

'నేను వెళ్ళే దాకా అలాగే నిలబడి ఉండు, క్లాసులో నిద్రపోతావా?',

అని మాస్టారు పాఠం చెప్పసాగాడు.

అప్పుడు అర్థమైంది రవికి మాస్టారు చెప్పేది లేఖ గురించి అని.

' సెలవు కోరుచూ ప్రధానోపాధ్యాయునికి లేఖ , ఇది మీకు పది మార్కులకి ఇస్తాను ఈ సారి '

అని మాస్టారు చెప్పసాగారు.

అందరూ శ్రద్ధగా విన్నారు ,నిద్రమత్తు వదలటంతో రవికూడా విన్నాడు.


లంచ్ బెల్ కొట్టారు, అందరూ పరుగెడుతూ వాళ్ళ గదుల్లోకి వెళ్ళారు

హాస్టల్ అంటే అలాగే ఉంటుంది మరి

భోజన సమయం అవటంతో అందరూ పళ్ళాలు పట్టుకోని భోజనానికి వెళ్తున్నారు

కాని రవి మాత్రం తెలుగు మాస్టారు చెప్పిన లేఖ గురించి ఆలోచించ సాగాడు.

' రవి వెళ్దాము రారా ', అని స్నేహితులు అడగగా

' మీరు వెళ్ళండిరా నేను తరువాత వెళ్తాను ', అని చెప్పి ఒంటరిగా రూములో కూర్చున్నాడు

మాస్టారు చెప్పిన లేఖ గురించే ఆలోచించ సాగాడు

దానిలొ ప్రధానోపాధ్యాయుడికి బదులు అమ్మకు లేఖ వ్రాయాలనిపించింది రవికి


రవికి అమ్మని చూసి చాలా రోజులైంది

హాస్టల్లో చేర్చినప్పటినుంచి అమ్మ మీద బెంగ పెట్టుకున్నాడు

అప్పుడప్పుడూ వాళ్ళ నాన్న వచ్చి చూసి వెళ్ళినా పన్నెండేళ్ళ రవికి మాత్రం అమ్మతోనే ఉండాలని ఆశ

అందుకే అమ్మకి లేఖ వ్రాయాలనిపించింది రవికి


మాస్టారు చెప్పిన నమూనా లేఖని దగ్గర పెట్టుకోని వ్రాయసాగాడు



******************************************************




తేది :10-02-95,

హైదరాబాద్.



అమ్మకి ,

మినర్వా పబ్లిక్ స్కూల్ ,

హైదరాబాద్.



విషయం:అమ్మని రమ్మని అడుగుతూ లేఖ

అమ్మా నేను రవిని. ఇప్పుడే క్లాసులు అయిపోయాయి,

అందరూ భోజనానికి వెళ్ళారు. నేను కాసేపు ఆగి వెళ్తాను. ఈరోజు లేఖ రాయటం ఎలాగో నేర్పించారు,

మొదటి లేఖ నీకే వ్రాస్తున్నాను.నాన్న ఎలా ఉన్నారు. మొన్న వస్తానన్నారు రాలేదు ఎందుకని ?

ఆ రోజు చాలామంది తల్లిదండ్రులు వచ్చారు, నేను మీకోసం చాలా సేపు చూసాను,

మీరెందుకు రాలేదు ? వాళ్ళందరినీ చూస్తే ఎందుకో నాకు ఏడుపొచ్చింది. ఇక్కడ ఒక సార్

వున్నారు తెలుసా ఆయన కూడా నాన్నలాగా భలే కధలు చెబుతారు.

నువ్వు ఎలా చదువుతున్నావు అని అడుగుతారు అంతేగా , నేను బాగానే చదువుతున్నాను.

క్లాసులో నాకు 4వ ర్యాంకు వచ్చింది . లెక్కల్లో 25/25 వచ్చాయి తెలుసా, లెక్కల

మాస్టారు నన్ను మెచ్చుకున్నారు కూడా. ఐనా ఎందుకో నాకు హాస్టల్ నచ్చలేదమ్మా,

నేను మన ఊరు వచ్చేస్తాను . వీళ్ళు ఇక్కడ నన్ను ఆడుకోనివ్వటం లేదు,

వర్షం లో తడవనివ్వటం లేదు , నాకు నచ్చినవి చేయనివ్వటం లేదు , రోజూ చదవమంటారు.

నాకు ఇక్కడ గోపి , రమేష్ అనే ఫ్రండ్సు ఉన్నరు తెలుసా . నువ్వు ఇక్కడకి వస్తే చూపిస్తా వాళ్ళని ,

నువ్వు కూడా నాతో ఆడతావు అంటుంటే వాళ్ళు నమ్మటం లేదు.

ఒక సారి నువ్వు వస్తే అందరం కలసి ఆడుకుందాం. ఈసారి సెలవులలో అమ్మమ్మావాళ్ళ

ఊరు వెళ్దాం, అక్కడ బాగా ఆడుకోవచ్చు, తాతతో కలిసి పొలంకి వెళ్ళచ్చు, ఐస్ క్రీములు,

చాక్లేట్లు తినచ్చు . తొందరగా సెలవలు వస్తేబాగుండు . నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు?

ఈ ఆదివారం వస్తావా, వచ్చేటప్పుడు నాకు తింటానికి బోలెడు చాక్లేట్లు తేవాలి .

చాక్లేట్లు తిసుకురాకపోయినా పర్లేదు నువ్వు మాత్రం తోందరగా రా. అమ్మా నన్ను మరచిపోవు కదా


ఇట్లు మీ విధేయుడు,

వి.రవి,

7 వ తరగతి,

మినర్వా పబ్లిక్ స్కూల్.


******************************************************

ఎప్పుడో తన చిన్నప్పుడు అమ్మకు వ్రాసిన ఉత్తరాన్ని చూస్తూ నవ్వుకున్నాడు రవి.

తను పోస్టు చేయని ఆ ఉత్తరాన్ని ఎప్పటికీ మరచిపోలేడు రవి .తన పర్సులో నుండి

అమ్మ ఫోటో తీసి చూసుకున్నాడు . తను ఈ ఉత్తరం రాయక ముందే అమ్మ చనిపోయిందని,

అందుకే తనను హాస్టల్లో చేర్చారని అప్పుడు రవికి తెలీదు.

తన చిన్నప్పుడే చనిపోయిన అమ్మని ఒకసారి గుర్తుతెచ్చుకొని తిరిగి తన పనిలో లీనమైపోయాడు

Thursday, August 7, 2008

ఓ ఉత్తరం


అది ఇరవైవ శతాబ్దం , ఇంకా భారతదేశం లో చెప్పుకోదగ్గ అభివృధి చెందని రోజులు 

దేశ సమాచారం తెలుసుకోవటానికి పత్రికలే దిక్కు.

భారత్ పాకిస్తాన్ల మద్య యుద్ధం జరుగుతున్న రోజులవి,

సరిహద్దు వద్ద భీకరమైన పోరు, 

ఎంతోమంది తమప్రాణాలు దేశానికి అర్పించగా, ఇంకెంతోమంది క్షతగాత్రులైనారు.


తమ బిడ్డలు ఎలా ఉన్నారో అని తల్లిదండ్రులు వారి సమాచారం కోసం వేయి కళ్ళతో

వేచీ చూస్తున్నారు. వారికి ఏహాని జరుగకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. 


***********************************************************

' రామయ్యా నీకు ఉత్తరం వచ్చింది, నీ కొడుకు దగ్గరనుంచి ', అన్న ఆ పొస్టుమాను

మాట వినగానే ఆ తల్లిదండ్రులకి ఎనలేని ఆనందం కలిగింది.


రామయ్య కొద్దిగా చదువుకున్నాడు , అందువల్ల అతనికి ఉత్తరం రాయటం చదవటం తెలుసు .

కాని అతని భార్య సీతమ్మ చదువుకోలేదు , అందువల్ల రామయ్య

ఆ ఉత్తరాన్ని తన భార్యకు చదివి వినిపిస్తున్నాడు 

రామయ్య    : ' పూజ్యులైన తండ్రిగారికి నమస్కరించి వ్రాయునది ,

                      నేను ఇచ్చట క్షేమం మీరు అందరూ అక్కడ క్షేమంగా ఉన్నరని తలుస్తాను. '

సీతమ్మ       : క్షేమమే బాబు , నువ్వు ఎలా ఉన్నావు 

రామయ్య    : నన్ను మొత్తం చదవనివ్వు , వాడు క్షేమంగానే ఉన్నాడంట 

రామయ్య    : ' ఇక్కడ యుద్ధం భీకరంగా ఉంది . ఎంతో మంది చనిపోయారు.'

సీతమ్మ      : నువ్వు జాగ్రత్త బాబు , తొందరగా ఇంటికి వచ్చేయి 

రామయ్య    : వాడికి తెలుసు ఏమిచేయాలో

సీతమ్మ       : మీరు చదవండి 

రామయ్య    : ' నా స్నేహితులు కూడా ఎంతోమంది చనిపోయారు.'

సీతమ్మ       : అయ్యో పాపం 

రామయ్య    : ' నాన్నా మీకో విషయం చెప్పాలి '

సీతమ్మ       : చెప్పు బాబు 

రామయ్య     : ' నాకు ఇక్కడ ఓ మంచి మిత్రుడు ఉన్నాడు 

                        వాడు, నేను ఈ సారి మన ఊరు వస్తున్నాం '

సీతమ్మ        : రమ్మనండి దానిదేముంది . ఎప్పుడు తీసుకు రమ్మన్నా వాడు

                        స్నేహితులని తేడు ఈ సారి మంచి బుద్ధి పుట్టినట్టుంది మనవాడికి 

                        ---తొందరగా చదవండి ఏమి రాసాడో 

రామయ్య     : నన్ను నువ్వు ఎక్కడ చదవనిస్తున్నావు 

సీతమ్మ        : సర్లేండి చదవండి 

రామయ్య     : ' కాని వాడికి యుద్ధములో ఓ కాలు ,ఓ చేయి పొయాయి 

సీతమ్మ        : అయ్యో పాపం , అతనిని తప్పకుండా తీసుకొని రమ్మనండి 

                       అలాంటి వారికి సాయం చేస్తే మనకే మంచిది 

రామయ్య     : అలాగే చెబుతానులే

రామయ్య     : ' వాడికి వాళ్ళ తల్లిదండ్రులూ చనిపోయారు '

సీతమ్మ        : అతనిని తప్పకుండా తిసుకు రమ్మనండి చేతనైనంత సాయం చేద్దాం.

రామయ్య     : అలాగే

సీతమ్మ        : వాళ్ళ దగ్గరి వాళ్ళ వివరాలు కూడా వాడిని తెలుసుకోమనండి 

రామయ్య     : ముందు వాడు రాసిన ఉత్తరం మొత్తం చదవనివ్వు తరువాత 

                       మనం రాసే ఉత్తరం గురించి ఆలోచించచ్చు 

సీతమ్మ        : సరె.. సరె.. మీరు చదవండి 

రామయ్య      : ' నాన్నా, అమ్మా నేను నా స్నేహితుడిని జీవితాంతం మన

                        ఇంట్లో ఉంచాలనుకుంటున్నాను '

సీతమ్మ        : జీవితాంతమా !

                       జీవతాంతం చేయటమంటే కష్టం కదండి

రామయ్య     : నేనూ అదే అనుకుంటున్నాను 

                       ఓ రెండు మూడు నెలలైతే చేయచ్చుగాని తరువాత ఐతే కష్టమే.

                       మనకే ఇక్కడ చేసేవాళ్ళు లేరు , పైగా అతనికి కాళ్ళు చేతులు లేవు

                       ఈ పరిస్థితులలో అతనికి జీవితాంతం చేయటం చాలా కష్టం .

సీతమ్మ        : ఈ విషయమే మనవాడికి కూడా చెప్పమనండి 

                       పాపం అతని మనస్సు నొచ్చుకోకుండా చెప్పమనండి 

రామయ్య     : నాకూ పాపం అని అనిపిస్తోంది కాని ఏదో ధన సహాయం 

                       ఐతే చేయొచ్చు గాని అతనికి జీవితాంతం సేవలు 

                        చేయటం మాత్రం కష్టమే

సీతమ్మ        : సరే తరువాత ఏమి రాసాడో చదవండి 

రామయ్య     : ' మీరు తప్పక నా మన్ననని మన్నిస్తారని ఆశిస్తున్నాను '

సీతమ్మ        : మీరే వాడికి అర్థమైయ్యేటట్లు ఉత్తరం వ్రాయండి. 

                       ఏదైన ధన సహాయం చేయమని చెప్పండి 

రామయ్య      : ' మీ ఆరోగ్యం జాగ్రత్త , అమ్మని కూడా జాగ్రత్తగా చుసుకోండి , 

                         అమ్మని అడిగానని చెప్పండి .

                                                                               -ఇట్లు మీ కుమారు…

సీతమ్మ        : ఈ దరిద్రపు యుద్ధాలవల్ల ఎంతమంది చనిపోతారో ...చ్చ ...!

రామయ్య      : నేను పోస్టాఫీసుకెళ్ళి ఉత్తరం తెస్తాను 


********************************************************

తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉత్తరం కోసం ఎంతో ఆత్రుతగా చూస్తున్న

ఆ సైనికుడికి తండ్రి రాసిన ఉత్తరం అందింది .




ప్రియమైన కుమారుడికి ,

               మేము ఇచ్చట క్షేమం . నీవూ క్షేమమని తలుస్తాము . నీ ఉత్తరం అందింది .

ముందుగా మీ స్నేహితుడిని అడిగానని చెప్పు , నీవు నీ స్నేహితుని పరిస్థితి చెప్పావు .

అతని పరిస్థితి వినగానే మాకూ బాధ కలిగింది , అతనికి చేతనైనంత సహాయం చేద్దాం.

కాని ఇక్కడ మన పరిస్థితీ ఆలోచించు, మనమేమీ జమిందారులంకాదు .


అతన్ని జీవితాంతం చూడటం కష్టం రా, పైగా అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు .

నువ్వే అతనిని అతని భంధువుల వద్దకు చేర్చు, వీలైనంత సహాయం చేయి .

ఉంటాము .అమ్మ నిన్ను అడిగాని చెప్పమంది. నువ్వు జాగ్రత్త .

ఎప్పుడు వచ్చేది మాకు తెలియజేయి.


                                                                           ఆశిస్సులతో , నీ తండ్రి రామయ్య 

  


**********************************************************


                    వారం తరువాత రామయ్యకు టెలిగ్రాము వచ్చింది ఆర్మి నుంచి .దాని సారాంశం 

' రామయ్య గారు , మీకు ఈ విషయం తెలియజేయటానికి చింతిస్తున్నాము.

మీ కుమారుడు నిన్నరాత్రి ఆత్మహత్య చెసుకున్నాడు. మీరు ఇచ్చటకు ఒక సారి రావలేను.'

అని పొస్టుమాను ఈ వార్త చెప్పగానే ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై ఏడ్చారు.

తమ కొడుకు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసుకోవడానికి వారు అక్కడికి వెళ్ళారు .


 అక్కడి ఆర్మీవారు అతని శవాన్ని చూపించారు.

తమ కొడుకు శవాన్ని చూసిన ఆ తల్లి దండ్రులకు నోట మాట రాలేదు . 

  చనిపోయిన తమ కుమారుడికి ఒక చెయ్యి , ఒక కాలు లేవు.